తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్
posted on Jun 25, 2025 10:53AM

ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. బుధవారం (జూన్ 25) జరిగే ఈ సమావేశంలో ఈ ఇద్దరు సీఎంలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ సీఎంలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రగతి అజెండాపై చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపై మోడీ చర్చిస్తారని అంటున్నారు. అలాగే రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పోలవరం అంశం కూడా మరోమారు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం పురోగతి, ఒడిశాలో రూ.18,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, తెలంగాణలో రూ.56,000 కోట్ల ప్రాజెక్టులు, ఛత్తీస్గఢ్లో గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం.