ఏపీలో మ‌రో కరోనా పాజిటివ్ కేసు

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండో క‌రోనా కేసు ప్రకాశం జిల్లా ఒంగోలులో నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలియజేసింది. అతడు నాలుగు రోజుల క్రితం వైరస్ లక్షణాలతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరగా.. పుణెకు శాంపిల్స్ పంపారు.. రిపోర్ట్స్‌లో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించగా.. వారిలో 94 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మరో 13 మంది రిపోర్టులు రావాల్సి ఉందని బులిటెన్‌ ద్వారా తెలియజేశారు.

 

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరికి ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. ఆ నోటీసును అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిద్-19 2020, ఐపీసీ 188 ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కోవిద్-19 నియంత్రణ, పర్యవేక్షణ చర్యలపై జిల్లా నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈనెల 31 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.