జగన్ దాడి కేసు.. వైసీపీ నేత జోగి రమేష్ కు నోటీసులు

 

జగన్ పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జగన్ పై దాడిచేసింది టీడీపీ కార్యకర్తేనని ఇటీవల జోగి రమేష్ ఆరోపించారు. శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త అనడానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ అతని టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును బహిర్గతం చేశారు. అయితే శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త కాదని ఆ సభ్యత్వ నమోదు ఫేక్ అని టీడీపీ చెప్తుంది. జోగి రమేష్ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తల మనోభవాలు దెబ్బతినేలా జోగిరమేష్ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు జోగిరమేష్ కు నోటీసులు అందజేశారు. ఈనెల 6న విచారణకు రావాలని ఆదేశించారు. జగన్ పై హత్యాయత్నం చేసింది టీడీపీ కార్యకర్తేనన్న వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించాలని నోటీసులో పొందుపరిచారు. పోలీసుల నోటీసులపై జోగిరమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని.. నోటీసులు ఒక రాజకీయ కుట్ర అని అన్నారు.