‘అగ్నిపథ్‌’ ఫై తగ్గేదే’ లే.. తేల్చేసిన సైన్యం

సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో, పథకం కొనసాగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని మీడియాలో, సోషల్ మీడియాలో చాల పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్’ సింగ్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన  సైనిక  అధికారులు, అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు.  

సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇతర దేశాల సైన్యాలపైనా త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారన్నారు. సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తోన్న సయమంలో వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు త్రివిధ దళాలకు చెందిన అధికారులు నేడు మీడియా ముందుకు వచ్చారు.

‘ప్రస్తుతం సాయుధ దళాల్లో ఉన్నవారి సగటు వయసు 30ఏళ్లకు పైగా ఉంది.ఇలా కొనసాగడం ఆందోళనకర విషయం.యువ సైనికులు అయితే సైన్యంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తారని భావించాం. సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువకులు అద్భుతాలు చేస్తున్నారు. అందుకే యువత సైన్యంలోకి రావటానికి, వెళ్లిపోవటానికి అవకాశాలు పెంచాం. ఈ క్రమంలో అనుభవం ఉన్నవారికి, యువశక్తికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం’ అని సైనిక వ్యవహారాల విభాగంలో అడిషినల్‌ సెక్రటరీగా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైన్యంలో వయసుకు సంబంధించి 1999 కార్గిల్‌ యుద్ధంపై ఓ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు.

‘సైన్యంలో యువతను ఎక్కువగా తీసుకునేందుకు సుదీర్ఘ సంప్రదింపులు జరిపాం. ఈ క్రమంలో విదేశీ సైన్యాలను కూడా అధ్యయనం చేశాం. ఎటువంటి సవాళ్లనైనా స్వీకరించే శక్తి యువత సొంతం. కొత్త టెక్నాలజీని యువత త్వరగా అందిపుచ్చుకుంటోంది. మూడు విభాగాల్లో ప్రతి సంవత్సరం 17,600 మంది ముందస్తు రిటైర్‌మెంట్‌ అవుతున్నారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు జరగలేదు. అందుకే ఈసారి ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నాం. అగ్నివీర్‌లు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu