పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు: కేంద్రం

 

గత ఐదేళ్ళలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటు చేసుకుందని అధికార వైసీపీ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతిపై విచారణ జరిపించాలని కూడా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తాజాగా రాజ్యసభలో చర్చ జరిగింది.

వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా.. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పుడు ఆమోదం తెలుపుతుందని విజయసాయి అడిగారు.  

విజయసాయి ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. అందువల్ల సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని.. వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని గజేంద్రసింగ్ స్పష్టం చేశారు.