‘టీ ’ కప్పులో కొత్త ట్విస్ట్.. తెరపైకి ట్రబుల్ షూటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం  స్పందించారు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా చిన్నా పెద్దా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించిన హరీష్ రావు..  కవిత ఎపిసోడ్ లో మాత్రం మొదటి నుంచి మౌనంగానే ఉన్నారు. నిజానికి.. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు, కేసీఆర్ మొదలు సంతోష్ వరకు, బీఆర్ఎస్ డ్రామాలోని ముఖ్య పాత్ర దారులు అంతా సైలెంట్ గానే ఉన్నారు.  ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న కవిత ఎపిసోడ్ లో కీలక పాత్ర దారులు ఎవరూ కూడా పెదవి విప్పలేదు.  కేసీఆర్ దేవుడు .. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ పరోక్షంగానే అయినా  ఆమె కుటుంబ సభ్యులపై వేలెత్తి చూపినా.. అంతకు మించిన వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు చేసినా..  అంతా గప్ చిప్. ఎవరూ పెదవి విప్పలేదు. అంతే కాదు.. కుటుంబ పెద్దలు మాట్లాడక  పోవడమే కాదు.. ఎవరూ మాట్లాడరాదని పెద్దాయన హుకుం జారీ చేశారనీ అందుకే  ఎవరూ పెదవి విప్పడం లేదని అంటున్నారు. 

అయితే.. ఇంతకాలంగా మౌనంగా ఉన్న హరీష్ రావు.. తెలంగాణ జెండా సాక్షిగా  పెదవి విప్పారు. తెలంగాణ భవన్‌లో  జూన్2న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న హరీష్‌రావు.. కవిత చేసిన కీలక వ్యాఖ్య పై స్పందించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు, కొందరు  కుట్ర చేస్తున్నారంటూ  కవిత  ఎవరి పేరూ ప్రస్తావించకుండా చేసిన విమర్శకు హరీష్ రావు  సమాధానం ఇచ్చారు.  అయితే ఇక్కడ హరీష్ రావు కూడా  కవిత పేరు ప్రస్తావించలేదు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందనీ..  బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని   కొందరు   అంటు న్నారు కానీ అందులో నిజం లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు.. విలీనం మాట దేవుడెరుగు, బీజేపీతోనే కాదు, ఇంకెవరితోనూ పొత్తు వరకు కూడా ఉందనీ..   కారు  ఒంటరిగానే రేసులో దిగుతుందని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్వయంగా కేసీఆర్  చెప్పారని గుర్తుచేశారు. అలాగే..  కేసీఆర్’ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే..  మరోవంక కవిత.. అంతకంటే ఎక్కుగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వరకూ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో బీఆర్ఎస్  విలీనం ఎపిసోడ్ ను సజీవంగా ఉంచేందుకు  శత విధాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ చేసిన ప్రచారం  హస్తం పార్టీకి బాగా కలిసోచ్చింది. హస్త రేఖలను మార్చివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మరలేందుకు కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగించిన ప్రచారం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 
అఫ్కోర్స్..  అదే సమయంలో బీజేపీ  బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి  తప్పులో కాలేసింది. కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్  ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఆ విధంగా బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకీ సోకింది. అంతవరకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దూకుడు చూపిన బీజేపీ ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది.  సో .. ఇప్పడు, మళ్ళీ రేపటి స్థానిక సంస్థల  ఎన్నికల్లో  అదే కార్డు ప్లే చేసేందుకు  ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ..  కవిత చేసిన  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని గట్టిగా పట్టుకుంది. స్థానిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు అంటున్నారు.

నిజానికి..  కవిత విలీనం అంశాన్ని తెరపైకి తీసుకు రావడం వెనక  కాంగ్రెస్ హస్తం ఉండ అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని, కేటీఆర్ అన్నది ఇందుకేనా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు ఎలా ఉన్నా.. కవిత ఎపిసోడ్ లో వెలుగులోకి వచ్చిన రాజకీయ చీకటి కోణాలు ప్రధాన పార్టీల పాతివ్ర త్యానికి పరీక్షగా నిలిచాయని అంటున్నారు. ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటన్నది పక్కన పెడితే..  రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు ఇదే మాదిరిగా అయితే ఉండవనీ,  కవిత ఎపిసోడ్ కు అటూ ఇటు అన్నట్లుగా మారిపోతాయని రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.