మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి పై దాడి

 

 

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ  పాలన కేంద్రం ఆత్మకూరులో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. ఆత్మకూరులో నంద్యాల ఎంపీ  శబరి  దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్న క్రమంలో ఏరాసు  కూడా ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఏరాసు ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఏరాసు ఇంటి నుంచి  వెళ్లిన  మరుక్షణమే ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముకుమ్మడి దాడి చేశారు. ఏరాసు గో బ్యాక్ అంటూ తెలుగు తమ్ముళ్లు   ఇంటి అద్దాలను  ధ్వంసం  చేశారు. 

దీంతో ఆత్మ రక్షణకు  ప్రతాప రెడ్డిని ఆయన అనుచరులు ఇంటిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసి వేశారు. కానీ  తెదేపా నాయకులు కార్యకర్తలు ఇంటిని చుట్టుముట్టి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు  దారి తీయడంతో   పోలీసులు తాపీగా ఏరాసు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలను  ఖాతరు చేయక తెలుగు తమ్ముళ్లు  రెచ్చిపోయారు.  ఏరాసు గో బ్యాక్, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిచ్చు  పెడుతున్నాడని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ  ఏరాసు ఇంటిని  చుట్టూ ముట్టారు. ఏరాసు  ప్రతాపరెడ్డిని తమ చేతికి అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. 

పరిస్థితి విషమించడంతో  పోలీస్ అధికారులు ఏరాసూ ఇంటికి చేరుకొని ఆయనను ఆయన కారులోనే మరో మార్గంలో ఆత్మకూరు నుంచి  తరలించారు. ఇదిలా ఉంటే  ఇంటి నుంచి బయటకు వచ్చిన ఏరాసు తనపై జరిగిన దాడిని దాడికి  కారకులు  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కారణమని చెప్పే క్రమంలో, ఏరాసు ప్రతాపరెడ్డిని మీడియాతో మాట్లాడానీయకుండా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ కారును అతివేగంగా తీసుకువెళ్లారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu