అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి
posted on Sep 10, 2014 11:14AM
అమెరికాలో ఒక భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా అంతమైపోయింది. ఉత్తర భారతదేశానికి చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు వున్నాడు. ఈ ఏడాది జనవరిలో సుమీత్ అమెరికా నుంచి ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్రూమ్లో ఐస్ కప్పి బయటపడింది. ఎందుకిలా జరిగిందని పల్లవిని పోలీసులు ప్రశ్నిస్తే, తన కొడుకు అనారోగ్యంతో మరణించాడని, తన భర్త విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు శవాన్ని భద్రపరచాలని ఐస్లో పెట్టానని ఆమె చెప్పింది. ఈ విషయంలో ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతూ వుండటంతో ఆర్నవ్ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పదంగా మరణించి కనిపించారు. సుమీత్ తలకు దెబ్బ తగిలి మరణించి వుండగా, పల్లవి స్విమ్మింగ్ పూల్లో శవమై తేలింది. వీరిని ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేక పల్లవే భర్తని చంపి తాను ఆత్మహత్య చేసుకుందా అనే విషయాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుటుంబం అనుమానాస్పద మరణం అమెరికాలో పెను సంచలనం సృష్టించింది.