పోగొట్టుకున్నచోటే వెతుకుతానంటున్న మురళీమోహన్
posted on Feb 2, 2013 1:11PM
"నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుకుతాను. రాజమండ్రిలో ఓడిపోయాను. తీరిగి అక్కడే పోటీచేసి గెలుస్తాను” అని సినీ నటుడు, జయభేరి సంస్థల అధినేత మురళీమోహన్ అన్నారు. గత ఎన్నిక ల్లో టిడిపి తరపున రాజమండ్రి లోక్ సభ స్థానానికి పోటీచేసిన మురళీమోహన్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఉండవల్లికి 3,57,449 ఓట్లు రాగా, మురళీమోహన్ కు 3,55,302 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రలో ఆయనను మురళీమోహన్ కలిశారు. చంద్రబాబు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడున్న పరిస్థితులలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తాను ఎక్కడ ఓడిపోయానో,అక్కడే గెలవాలని,ఎక్కడ పోయిందో , అక్కడే వెతుక్కుంటానని” అన్నారు.