నైరుతి వచ్చేసింది.. ఇక వానలే వానలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ
posted on May 13, 2025 3:11PM

మండే ఎండల్లో చల్లటి కబురు వినిపించింది వాతావరణ శాఖ. వేసవి తాపం నుంచి త్వరలోనే జనాలకు ఉపశమనం కలగబోతోందని చెప్పింది. దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురకుగా కదులుతున్నాయన్న తొలకరి లాంటి కబురు చెప్పింది రైతులలో ఆశల మెలకలెత్తించింది. ఐఎండీ. అంచనాలకు మించి నైరుతి రుతుపవనాల కదలిక వేగం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మంగళవారం (మే 13) అండమాన్, నికోబార్ ఐలెండ్స్ ను తాకాయన్న చిరుజల్లు లాంటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు నాలుగు రోజులలో అవి మరింత విస్తరించి అండమాన్ నికోబార్ అంతటా వ్యాపిస్తాయనీ, అలాగే మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయనీ పేర్కొంది.
రుతుపవనాల కదలికకు వాతావరణం అనుకూలంగా ఉందనీ, ఇదే వేగంతో రుతుపవనాల విస్తరణ ఉంటే.. ముందుగా అంచనా వేసినట్లు మే 27 వరకూ అగాల్సిన అవసరం లేకుండా అంత కంటే రెండు మూడు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదౌతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.