స్పీడ్ మీదున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. నేడు టీడీపీలోకి

 

వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి వలసల పర్వం సాగుతోంది. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టి టీడీపీలోకి జంప్ అవుతున్నారు. నిన్ననే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు మరో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గత కొంత కాలంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అయితే  ఆయన ఇంకా టీడీపీలో చేరకముందే చాలా స్పీడ్ మీదున్నట్టు తెలుస్తోంది. అప్పుడే తాను టీడీపీ ఎమ్మెల్యే గా తన ఫేస్ బుక్ ఫ్రొఫైల్ నే మార్చేశాడు. ఇంకా తన ఎంట్రీని కూడా గ్రాండ్ గా జరుపుకోవాలనుకున్నాడో ఏమో ఏకంగా.. 35 బస్సుల నిండా తన కార్యకర్తలతో విజయవాడకు బయలుదేరాడు. దీనిలో భాగంగానే చంద్రబాబును కలిసి ఆయన ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.  కాగా ఈయన చేరికతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరనుంది.