హానీమూన్ మర్డర్.. మతలబేంటంటే?
posted on Jun 11, 2025 12:41AM

హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.
ఇంతకీ ఎవరీ సోనమ్? ఈమె ఎవర్ని పెళ్లాడింది? తన భర్తను ఎప్పుడు హతమార్చింది? ఎవరి సాయంతో ఈ పని చేసిందన్న ప్రశ్న చాలా మందిలో ఆసక్తి రేకిస్తోంది. ఉత్కంఠ భరితమైన ఈ విషాదగాథలో నిందితులు సోనమ్- రాజ్ కుష్వాహా కాగా.. మృతుడు రాజా. రాజాకు సోనమ్ కు మే 11న పెళ్లయ్యింది. వీరు హానీ మూన్ కి మేఘాలయకు వెళ్లారు. పెళ్లయిన 12 రోజులకే .. అంటే మే 23న రాజా హత్యకు గురయ్యాడు. దీనంతటికీ కారణం 21 ఏళ్ల రాజ్ కుష్వాహాతో సోనమ్ కి ప్రేమ వ్యవహారం ఉండటమేనని తెలుస్తోంది. రాజా కుష్వాహా తన స్నేహితులతో కలసి.. రాజాను హతమార్చారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టు చెబుతున్నారు. అంతే కాదు సోనమ్ సైతం ఈ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో తన సోదరి ప్రమేయం ఉన్నట్టు అధికారికంగా తెలీయడం లేదనీ, ఒక వేళ అదే నిజమైతే.. ఆమెకు తప్పకుండా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడు నిందితురాలు సోనమ్ సోదరుడు గోవింద్. రాజా సోదరుడు విపిన్ తో కలసి మీడియాతో మాట్లాడిన గోవింద్ ఈ డిమాండ్ లేవనెత్తారు.
హానీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాజా కుష్వాహా మరెవరో కాదు గోవింద్ ఫ్లై- ఉడ్ ఫ్యాక్టరీలో పీఆర్ గా పని చేస్తున్న వ్యక్తే. ఆమాటకొస్తే కుష్వాహా తన సోదరిని అక్కా అక్కా అని పిలిచేవాడని.. ఇద్దరం పక్క పక్కన ఉన్నపుడు తన సోదరి తనతో పాటు కుష్వాహాకూ రాఖీ కట్టిందనీ గోవింద్ చెబుతున్నారు.
ఇపుడీ వ్యవహారం ఎందుకంత హాట్ టాపిగ్గా మారిందంటే.. ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో హానీమూన్ లో ఉండగానే ప్రియుడితో కలసి తన భర్తను మర్డర్ చేయించిన నవ వధువుగా చరిత్రకెక్కింది సోనమ్. ఒక పక్క దేశంలో భారత్- పాక్ అంటూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇదేదీ లెక్క చేయని ఈ ఇద్దరూ ప్రేమికులు (వీరికి మరేదైనా పేరు పెట్టాలి) తమ అడ్డు తొలగించుకోవడంలో భాగంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం దారుణంగా భావిస్తున్నారు. అందుకే ఈ మర్డర్ కేసులో తన సోదరి పాత్ర నిజమైతే, ఆమెకు తప్పక మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాడు గోవింద్. ఎందుకంటే తాను ఎప్పుడైతే తన సోదరిని రాజా ఇంటికి ఇచ్చానో అప్పటి నుంచీ ఆ కుటుంబంలో ఒక భాగం అయ్యాననీ.. అందుకే తాను కూడా వారి పక్షమేననీ.. కాబట్టి ఆ కుటుంబానికి నా వల్ల జరిగిన అపరాధానికి తాను న్యాయం కోరుతున్నానని బోరున విలపిస్తూ చెప్పాడు గోవింద్.