జగన్ బాబు పిలుపు కోసం మానుగుంట నిరీక్షణ?

 

 

 

ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత మానుగుంట మహీధర రెడ్డి కిరణ్ క్యాబినెట్ లో మొదటిసారి మున్సిపల్ శాఖామంత్రిగా భాద్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే కెప్టెన్ నల్లారి జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజనతో కిరణ్ పదవికి రాజీనామా చేయడంతో మానుగుంట కూడా మాజీ అయ్యారు. అయితే కిరణ్ కొత్త పార్టీలో మాత్రం చేరలేదు. రాజకీయాల్లో రాజీ పడని వ్యక్తిగా, పాలనాదక్షుడిగా పేరున్న మానుగుంట ప్రస్తుతం జగన్ బాబు పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు వచ్చి వాలిపోతాను అని కందుకూరుకు చెందిన ఓ ఉన్నతాధికారితో రాయబారం పంపారట. వైసీపీ లో జగన్ తరువాత చెప్పుకోదగ్గ పవర్ సెంటర్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డికి బంధువైన ఉన్నతాధికారి ఎలాగైనా మానుగుంటను పార్టీలో చేర్చాలని కంకణం కట్టుకున్నారట. అయితే జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ పేరు ఉందని, తానే డైరెక్టుగా జగన్ దగ్గరకు వెళ్లి పార్టీలో చేరితే కేడర్, ద్వితీయ శ్రేణి నేతల ముందు పలుచన అయిపోతానని, ఒక్కసారి జగన్ మిస్సిడ్ కాల్ ఇచ్చినా చాలు.. జగనే తనను పార్టీలోకి ఆహ్వానించారని, నియోజకవర్గ ప్రజల కోరిక కూడా అదే కావడంతో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారట మానుగుంట. మరో వైపు వైసీపీలో మొదటి నుంచి పనిచేస్తూ జిల్లా కన్వీనర్ గా భాద్యతలు నిర్వహించిన నూకసాని బాలాజీ ఎప్పటి నుంచో తనకు కందుకూరు టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. మానుగుంట పార్టీలో చేరితే బాలాజీకి ఇక సీటు దక్కేది అనుమానమే? మరో వైపు జిల్లా వైసీపీనీ అన్నే తానే అయి నడిపిస్తున్న బాలినేనికి కూడా మానుగుంట పార్టీలో చేరితే ఇబ్బందులు తప్పవు. అందుకే మహీధర్ కు జగన్ నుంచి ఫోన్ రావాలంటే.. ముందు బాలినేని నుంచి గ్రీన్సిగ్నల్ రావాలి.