మరికొద్ది సేపటిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిక
posted on Oct 28, 2014 2:24PM
(1).jpg)
మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో 122 సీట్లు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న శరత్ పవార్ నేతృత్వంలోని యన్.సీ.పి. కూడా బీజేపీకి బయట నుండి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడటంతో ఇంతవరకు చాలా బెట్టుచేసిన మిత్రపక్షమయిన శివసేన కూడా దిగివచ్చి బీజేపీకి మద్దతు పలికింది. ముందు అనేక షరతులు విదించిన శివసేన ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని నియమించినా మద్దతు ఇస్తామని ప్రకటించడంతో ఇక బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లాంచనమే అయింది.
ఈరోజు సాయంత్రం4గంటలకు ముంబైలోని మహారాష్ట్ర విధాన భవన్ లో జరిగే బీజేపీ లేజిస్లేచర్ సమావేశంలో కొత్తగా ఎన్నికయిన యం.యల్యేలు శాసనసభా పక్ష నేతను ఎన్నుకొంటారు. ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపడతారు. మహారాష్ట్రలో బీజేపీని విజయపధంలో నడిపించిన పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక అయిన తరువాత బీజేపీ శాసనసభ్యులు గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావుని కలిసి తమ నిర్ణయం తెలియజేస్తారు. ఆ తరువాత గవర్నర్ ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తారు. ఈనెల 31న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం కూడా ఖరారయింది. కేంద్ర పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి రాజ నాథ్ సింగ్ మరియు సీనియర్ బీజేపీ నేత జెపినడ్డాల సమక్షంలో ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది.