70 లక్షల మందిని అరెస్ట్ చేస్తారా? డీజీపీని నిలదీసిన లోకేశ్..
posted on Oct 21, 2021 2:33PM
టీడీపీ నేతల అరెస్ట్లపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే.. తెలుగుదేశం పార్టీలో 70 లక్షల మందిని అరెస్ట్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డీజీపీ గారూ! మాపైనా, మా కార్యాలయాలపైనా దాడి చేసినోళ్లలో ఒక్కడినైనా అరెస్ట్ చేశారా?.. ఇదేం అరాచకమని శాంతియుతంగా నిరసన తెలిపే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారా?. మా నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే..తెలుగుదేశం పార్టీలో 70 లక్షల మందిని అరెస్ట్ చేయాలి. ఒక్కసారి బుర్రతక్కువ సలహాదారుల బుర్రతో కాకుండా చదువుకున్న ఐపీఎస్ బుర్రతో ఆలోచించండి. మీరు చేస్తున్నది ఎంత తప్పో తెలిసొస్తుంది.. అంటూ ట్విటర్లో మండిపడ్డారు లోకేశ్.
నాదెండ్ల బ్రహ్మంని నిన్నటి నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పి..తిప్పి ఏదో చేయాలనే మీ ప్లాన్ బెడిసికొట్టడంతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలినా మీదే బాధ్యత డీజీపీ గారు. చట్టాన్ని అతిక్రమించి చేసిన ప్రతీ అరెస్టుకి, పాల్పడిన ప్రతీ అరాచకానికీ న్యాయస్థానాల ముందు తలదించుకుని దోషిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండండి.. అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.