శరణమా? న్యాయసమరమా?.. తేల్చుకో జగన్.. లోకేష్ మాస్ వార్నింగ్
posted on Jun 15, 2025 7:49AM

గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే. ముందు కూడా తిరుమలలో పింక్ డైమండ్ అంటూ వైసీపీయులు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండే లేదని తేలింది. అలాగే బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి దాడి.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది.
అయితే.. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కుండ బద్లలు కొట్టేశారు. తాజాగా తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయల విమనహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ.. నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కోరి శరణు జొచ్చుతావా.. న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తల్లికి వందనం డబ్బులుతన జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలంటూ లోకేష్ సవాల్ కు జగన్ నుంచి సౌండ్ లేకపోయే సరికి మరోసారి ట్విట్టర్ వేదికగా లోకేష్ జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. తాను ఇచ్చిన 24 గంటల గడువు ముగిసిపోయినా.. జగన్ నుంచి సౌండ్ లేదనీ, అందుకే ఆయనను ఫేక్ జగన్ అంటున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు. సమయం లేదు మిత్రమా శరణమా, న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. లోకేష్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అంతే కాదు నారా లోకేష్ ఏ విషయాన్నీ అంత తేలికగా వదిలేరకం కాదని వైసీపీకి బాగా తెలుసు. గతంలో చినబాబు చిరుతిండి అనే శీర్షికతో జగన్ సొంత మీడియాలో ప్రచురితమైన వార్త విషయంలో లోకేష్ చేస్తున్న న్యాయపోరాటం.. ఆ మీడియాను, వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పుడు తల్లికి వందనం కేసులో వైసీపీ, జగన్ ఇష్టారీతిగా చేసిన ఆరోపణల విషయంలో లోకేష్ శరణమా, న్యాయ సమరమా అని అల్టిమేటం ఇవ్వడంతో వైసీపీలో వణుకు మొదలైందంటున్నారు.