తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి లేదు.. ఉన్నదంతా నకిలీయే!
posted on Jun 7, 2025 9:45AM
.webp)
చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిజాల నిగ్గు తేలుస్తోంది.
వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే అంత భయం ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ ఉందనీ తలపోశారు. అయితే.. ఇప్పుడు సిట్ దర్యాప్తులో వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం లో అసలు కల్తీ నెయ్యి వాడలేదనీ.. వాడింది మొత్తం నకిలీ నెయ్యేననీ సిట్ కోర్టులు తెలిపింది. నిజానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే నకిలీ అని సిట్ తేల్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది. ఆ సిట్ దర్యాప్తులో ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని సిట్ స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టి వేయాలని కోరుతూ దాఖలు చేసిన అఫిఢివిట్ లో సిట్ ఈ సంచలన విషయాలను పేర్కొంది.
నిజానికి భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని సిట్ స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారని సీట్ వివరించింది. భోలేబాబా డెయిరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీలను ముందుపెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపిందన్నది సిట్ అభియోగం.
అంతే కాకుండా ఇప్పుడీ నెయ్యి మాఫియా ..సాక్షుల్ని బెదిరిస్తోంది. సాక్షులపేరుపై తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. మాఫియా కాపలా కాస్తున్నది. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ అనే వ్యక్తి తిరుపతి ఎయిర్ పోర్టులో దిగగానే ఆయనను కిడ్నాప్ చేసి.. చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించేశారు. మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యక్తే స్వయంగా తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను సిట్ కోర్టు ముందుంచింది. అసలు ఆ నకిలీ నెయ్యిని టీటీడీ ఎందుకు కొనుగోలు చేసింది? దీని వెనుక ఎవరు న్నారు.. అన్న విషయాలను రాబట్టాలంటే.. నిందితులకు బెయిలు ఇవ్వవద్దని సిట్ కోర్టును కోరింది. సిట్ ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎను విచారిస్తున్నది, ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది త్వరలో బయటకు రానుంది.