ప్రగతిభవన్ లో పగులుతున్న టీవీలు! సీఎం పోస్టు కోసం హిమాన్షు..

తాతా.. మా నాన్నను సీఎం ఎప్పుడు చేస్తావ్? అసలు ముఖ్యమంత్రిని చేస్తావా? లేదా? మా డాడీని సీఎం చేయాల్సిందే. లేదంటే, ఊరుకోను అంటూ కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కొడుకు 'హిమాన్షు' రోజుకో టీవీ పగలగొడుతున్నాడట. టీవీల కోసం ప్రగతి భవన్ ఎదుట టీవీ షోరూం ఏర్పాటు చేయాలట. ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయం వెల్లడించారు. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఆయన ముద్దుల కొడుకు హిమాన్షు ప్రతిరోజూ పోరు పెడుతున్నాడంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పువ్వు గుర్తు పెద్దాయన సెటైరిక్ గా ఈ మాటలు అన్నారో.. లేక, నిజమో తెలీదు గానీ.. ఈ డైలాగ్ మాత్రం పొలిటికల్ గా తెగ వైరల్ అవుతోంది. 

కొంత కాలం క్రితం కేటీఆర్ ను త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తారంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం బయటి వాళ్లెవరూ చేయలేదు. స్వయంగా కారు పార్టీ నేతలే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ లీకులమీద లీకులు ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ఓపెన్ స్టేట్ మెంట్లు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే.. ఓ బహిరంగ సభలో కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలంటూ విషెష్ చెప్పారు. పద్మారావు ఆ మాటలంటుంటే అక్కడే ఉన్న కేటీఆర్ మౌనంగా ఉన్నారే కానీ ఆ మాటలను అడ్డుకోలేదు. ఆ ఘటన తర్వాత ఇక కేటీఆర్ సీఎం కావడం ఖాయం అని అంతా భావించారు. అంతలోనే ఏమైందో ఏమో గానీ.. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చే్స్తారనే మేటర్ మరుగునపడింది.

తనను ముఖ్యమంత్రిని చేయకపోవడంపై కేటీఆర్ బాగా నారాజ్ అయ్యారని అంటున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కు కేటీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని.. తండ్రీకొడుకులు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ చేసిన కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ కేసీఆర్ మనువడు హిమాన్షు టీవీలు పగలగొడుతున్నాడంటూ బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో.. హిమాన్షుకే ఎరుక..