తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థి కృష్ణయ్య: చంద్రబాబు

 

 

 

తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుందని, తెలంగాణలో సంపూర్ణ మెజారిటీ వస్తే ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌లాగా తాను మాట తప్పే వ్యక్తిని కాదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటి వరకూ తెలుగుదేశంలో తెలంగాణకు బీసీని సీఎం చేస్తామన్న చర్చే జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కృష్ణయ్యే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీలో, బయట జరిగింది. కృష్ణయ్య కూడా తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడి నోటివెంట అధికారికంగా కృష్ణయ్య పేరు రావడంతో కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఖరారైనట్టు అయింది. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బీసీల ఓట్లు పెంచే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.