సింహపురి రూరల్ పాలిటిక్స్... కోటంరెడ్డి బ్రదర్స్ మార్క్
posted on May 17, 2025 2:59PM

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు పార్టీ ఫిరాయించడంతో, పార్టీ పిరాయంపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనార్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖలు అందించింది. చర్యలు తీసుకునే లోపే ఎన్నికలు వచ్చాయి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.
సంచలన రాజకీయాలకు కేరాఫ్గా నిలుస్తుంటారు టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాభిమానంతో వరుసగా మూడుసార్లు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్గా ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేసి, మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్యే కోటం రెడ్డి హ్యాట్రిక్ విజయాల వెనుక తన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమంట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇపుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. సుదీర్ఘకాలం తమ అడ్డాగానే ఉండాలనే లక్ష్యంతో కోటం రెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లాన్ తో కోటంరెడ్డి బ్రదర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. ఈసారి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నిలబెట్టేందుకు తన రాజకీయ వారసుడిగా తెరమీదకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తనను ఆదరించినట్లే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా ఆదరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరుతున్నారట. రేపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త సెగ్మెంట్లు ఏర్పడతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంట.
మరో పక్క ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుసరించిన స్ట్రాటజీనే తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు.. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం.. అభివృద్ధి పనులు చేయడం..వ్యక్తిగత ఇమేజ్ను పెంచు కోవడం.. ఇవే కోటంరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేశాయంట. ఇప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే "గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి" కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా తన తమ్ముడితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. రూరల్ నియోజకవర్గంలో దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా ఒకేరోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు. తర్వాత వారం రోజుల్లో వరుసగా 234 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మంత్రి లోకేష్ అభినందనలు అందుకున్నారు. మొత్తం 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఆరోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయించారు. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
ఇలా ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయిస్తూ, మరో వైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్ట పరుస్తూ.. కోటంరెడ్డి బ్రదర్స్ తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. నిత్యం ప్రజల్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని దాన్నే ఎన్నికల్లో అస్త్రంగా వాడు కుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా, ప్రతిరోజు ఎన్నికలన్నట్టు కోటంరెడ్డి బ్రదర్స్ కష్టపడుతూ ... ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటుండటంతో కోటంరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. రాజకీయంగా ఎదుర్కోవాలన్నా.. ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోందట.
అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. అయితే ఆ పార్టీ నుంచి జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ , ఆనం రామనారాయణరెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. దాంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కావాలన్నా కల నెరవేరలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కోటంరెడ్డి క్యాబినెట్ బెర్త్ ఆశలు ఎప్పటికి నెరవేరతాయో చూడాలి.