టీఆర్ఎస్ పార్టీని వీడటానికి కారణం అదికాదు

 

టీఆర్ఎస్ పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియాతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని కలిశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని.. మహేందర్‌రెడ్డితో వివాదాల కారణంగా తాను టీఆర్ఎస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని.. అందుకోసమే తాను పార్టీని ఎందుకు వీడతానన్నారు. అలాంటి చిన్న విషయాలు పార్టీని వీడేందుకు కారణం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని.. ప్రాంతీయ పార్టీలతో సమస్యల పరిష్కారం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌తోనే తన నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యల గురించి తాను రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. ఎంఎంటీఎస్‌, వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ తదితర సమస్యల గురించి వివరించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. 23న మేడ్చల్‌ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కుంతియా మీడియాకు తెలిపారు.