విచారణకు కేసీఆర్ రెఢీ?!

కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ..  అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.

అయితే.. ఇప్పడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతితో పాటుగా, నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌   (కాళేశ్వరం కమిషన్‌) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదే విధంగా నీటి పారుదల శాఖ మాజీ  మంత్రి హరీశ్‌రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు జారీచేసింది. జూన్‌ 6న హరీశ్‌రావు, అదే నెల 9న ఈటల రాజేందర్‌ ను విచారణకు హాజరుకావాలని కోరింది. 

ఇప్పడు.. ఈ పిలుపు సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌  విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే.. ,అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరవుతారా? లేక న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అనేది కీలకంగా మారుతోంది. ఒక విధంగా  ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. 

అయితే..  అధికారికంగా బీఆర్ఎస్  నుంచి ఎలాంటి ప్రకటన లేక పోయినా..  కేసీఆర్ విచారణకు హాజరు అవుతారనే బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై రాజకీయ పోరాటానికి దీన్నొక అవకాశంగా తీసుకునే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో అన్ని కోణాల్లో చర్చించి, ముఖ్యంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలని  ‘ఫార్మ్’ హౌస్ నిర్ణయనికి వచ్చినట్లు చెపుతున్నారు. 

ఈ నేపథ్యంలో కమిషన్  విచారణకు హాజరు కావడం వలన చట్టపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటుగా రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయంతీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. కేసీఆర్  విచారణకు హరరైనా కాకున్నా, కమిషన్ ఇచ్చే నివేదికలో మార్పు ఏమీ ఉండదు. నిజానికి, రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా నివేదిక ఇప్పటికే  సిద్దమైందని అంటున్నారు.  కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. మరో వంక విచారణకు హాజరు కాకపోతే..  తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనీ,  అలాగే  రాజకీయ బురద చల్లేందుకు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరు కావడమే ఉత్తమమని బీఆర్ఎస్  ముఖ్య నాయకులు, ముఖ్య సలహాదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి  ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు..  తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? అంటూ  సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు గతంలో ఫార్ముల ఈ కేసులో కేటీఆర్  ఏసీబీ విచారణ తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పడు కేసీఆర్ కూడా అదే బాటలో నడిస్తే మరింత అభాసుపాలు కావాల్సి వస్తుందనీ..   సో  విచారణను ఒక  అవకాశంగా మల్చు కుని రేవంత్ రెడ్డి చరిత్రను,  కాంగ్రెస్ చరిత్రను ఎండకట్టవచ్చని అంటున్నారు. అలాగే కాళేశ్వరం ఎపిసోడ్ మొత్తం రాజకీయ డ్రామాగానే చూడాలనీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు ఇదొక మచ్చుతునక, తప్ప మరొకటి కాదని  పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. 

మరోవంక కొంత వరకు స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ లో సెంటిమెంట్ రగిల్చేందుకు ఇదొక అస్త్రంగా పనిచేస్తుందనిరాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  ఓడిపోయినా..  కేసీఆర్ పట్ల ఇటు ప్రజల్లో అటు పార్టీ క్యాడర్ లో అంతగా వ్యతిరేకత లేదని అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్  లో అవినీతి జరిగినా.. తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైన నీళ్ళు, నియామకాలు, నిధుల్లో.. మొదటిదైన నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటుగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో పాస్ మార్కులు కాదు, ఫస్ట్ క్లాసు మార్కులే తెచ్చుకుందని పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో కానీ,  కాళేశ్వరం కమిషన్  కేసీఆర్ ను విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.