కేసీఆర్ సభ రద్దవుతుందా?
posted on Apr 11, 2021 4:00PM
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శనివారం ఒక్క రోజే లక్షా 52 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా భయంకరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకు 3 వేలకు పైగానే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో గతంలో ఎప్పుడు లేనంతగా కేసులు వచ్చాయి. దీంతో జనాల్లో భయాందోళన నెలకొంది.
కరోనా తీవ్రత పెరగడంతో ఈనెల 14న నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభపై సందిగ్థత నెలకొంది.తిరుపతిలో ఏపీ సీఎం జగన్ ఎన్నికల కరోనా కారణంగా రద్దు కావడంతో.. నాగార్జున సాగర్ లో తలపెట్టిన కేసీఆర్ సభపై చర్చ జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా బహిరంగసభను కేసీఆర్ రద్దు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 14న కేసీఆర్ సభకు కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా కారణంగా సీఎం జగన్ సభ రద్దు చేసుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ ఓటమి భయంతో రెండో సారి సభ పెడుతున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సభ రద్దు చేసుకోవాలని జీవన్రెడ్డి కోరారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం సభ ఏర్పాటు ఖాయమైంది. సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు.