పోరాటానికి సిద్దం అంటున్న కాశ్మీర్ నేతలు !
posted on Aug 5, 2019 3:18PM

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన పట్ల ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఏకపక్షంగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ఆయన భారత ప్రభుత్వం మీద కశ్మీర్ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కేంద్రం వమ్ము చేసిందని అన్నారు. ఈ నిర్ణయం తీవ్ర పర్యావసనాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది కశ్మీర్ ప్రజలపై దురాక్రమణగా ఆయన అభివర్ణించారు.
నిజానికి ఆర్టికల్ 370 రద్దు లాంటి పెద్ద నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని భారత ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారని, కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతాన్ని సైనిక శిబిరంగా మార్చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారని, ప్రజల గొంతుకను వినిపించే మాలాంటి వారిని నిర్బంధంలో ఉంచి లక్షలాది సైనికులను మోహరించారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకిస్తోంది.
సుదీర్ఘమైన, కఠిన పోరాటం ముందుంది. మేం దానికి సిద్ధంగా ఉన్నామని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదే విషయం మీద స్పందించిన జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని తీవ్రంగా విమర్శించారు. 1947లో జమ్ముకశ్మీర్ నేతలు తీసుకున్న రెండు దేశాల సిద్ధాంతాలకు ఇది తూట్లు పొడవటమే.
ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని, ఇది జమ్ముకశ్మీర్ను ఇండియా బలవంతంగా తమ చేతుల్లోకి తీసుకోవడం లాంటిదేనని అన్నారు. దీని వలన విపత్కర పరిణామాలు చోటుచేసుకోవచ్చని, భారత ప్రభుత్వ ఉద్దేశాలు పూర్తిగా అర్థమయ్యాయని, ప్రజలను భయపెట్టి జమ్ముకశ్మీర్ భూభాగాన్ని కాలపాలనుకుంటున్నారు. కశ్మీర్ విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భారత ప్రభుత్వం విఫలమైందని ముఫ్తీ పేర్కొన్నారు.