దిల్లీని ఢీకొట్టిన ద్రవిడ దర్పం కరుణానిధి..!

ముత్తువేల్ కరుణానిధి... ఆధునిక తమిళ ఇతిహాసంలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం! దశాబ్దాలపాటు ద్రవిడ నేలను కనుసైగలతో శాసించాడు. అభిమానులు ఆయనను ఆరాధనతో 'కలైంగర్' అని కీర్తిస్తారు. అంటే కళాకారుడు అని అర్థం. ఆయన నిజంగానే రాజకీయ కళని ఔపోశన పట్టిన కళాకారుడు!

 

 

1969-2011 నడుమ మొత్తంగా ఐదు సార్లు తమిళనాడుకు సీఎంగా పని చేశారు. అయితే ఈ రాజకీయ చాణక్యుడు రాజకీయాల్లోకి రాకముందు కోలీవుడ్ సినీ పరిశ్రమలో సంభాషణల రచయిత! తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలు లాంటివెన్నో విరచించారు. తమిళ సాహిత్యంలో ఆయన పాత్ర అద్వితీయం!

1924లో బ్రిటీష్ కాలపు మద్రాస్ ప్రెసిడెన్సీలోని  తిరుక్కువలైలో కరుణ జన్మించారు. తమిళ నాయి బ్రాహ్మణ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. జీవితకాల నాస్తికుడైన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన పేరు… దక్షిణా మూర్తి!

స్కూలు రోజుల్లోనే డ్రామా, కవిత్వం, రచనల్లో ఆయన ప్రతిభ ప్రదర్శించారు. జస్టిస్ పార్టీలో ప్రముఖ నాయకుడైన అళగిరిస్వామి ప్రసంగాలతో తరువాతి కాలంలో ఉత్తేజితుడయ్యాడు! 14వ ఏట నుంచే సామాజిక పోరాటాల వైపు ఆకర్షితుడయ్యాడు.

 

 

సినిమా రచయితగా 'రాజకుమారి' చిత్రంతో ప్రస్థానం ప్రారంభించారు కరుణానిధి. రాజకుమారి చిత్రంలో హీరో ఎంజీఆర్. అప్పుడు మొదలైన వారిద్దరి పరిచయం స్నేహంగా మారి చాలా కాలం పాటు కొనసాగింది. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం ఎంజీఆర్, కలైంగర్ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు కరుణానిధి రచయితగా పని చేశారు.

14 ఏళ్ల వయసులోనే కరుణ అళగిరిస్వామి స్ఫూర్తితో స్థానికంగా ఓ యూత్ సొసైటీని నడిపారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే విద్యార్థి సంఘానికి ఊపిరిపోశారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు.

 

 

33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

1969లో అన్నాదురై చనిపోయాక తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి డీఎంకే తొలి అధినేత కూడా! పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై తాను ఉన్నంత కాలం అధ్యక్ష పదవిని  ఖాళీగా ఉంచేవారు. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే పిలవబడేవారు. అలా డీఎంకే ఫస్ట్ ప్రెసిడెంట్ అనిపించుకున్నది కూడా కరుణనే! అంతే కాదు తమిళ సినీ సెలబ్రిటీ సీఎం అవ్వటం కూడా కలైంగర్ తోనే మొదలైంది!

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలపు పరీక్షా సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఆమెను వ్యతిరేకించలేదు. తమిళనాడులోని డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతా పార్టీతో కరుణ జతకలిశారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. దీంతో, అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే విజయం సాధించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినా నిరంతర ఓటముల్లో కూడా కరుణానిధి పట్టుదలగా, తెలివిగా పార్టీని నడిపారు. నిబెట్టారు.

 

 

తమిళ చరిత్రలో సీఎంగా కలైంగర్ శకం….

    1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు
    1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు
    1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు
    1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు
    2006 మే 13 నుంచి 2011 మే 15 వరకు

కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో, తంజావూర్ యూనివర్శిటీ  'రాజ రాజన్' బిరుదుతో సత్కరించాయి. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జయలలిత డీఎంకే అధినేతను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కూడా కరుణానిధి మద్దతిచ్చారంటారు. 2009లో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని స్వయంగా కరుణనిధే చెప్పటం గమనార్హం!

మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు ఈ తమిళ చాణుక్యుడు! పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ ఆయన భార్యలు. ముగ్గురు భార్యలతో ఆయనకు కలిగిన సంతానం…  ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి…

Online Jyotish
Tone Academy
KidsOne Telugu