మిజో గవర్నరు కమలాబెనీవాల్ కు ఉద్వాసన
posted on Aug 7, 2014 12:26PM

గుజరాత్ గవర్నరుగా వ్యవహరించిన కమలబెనీవాల్ కొద్ది రోజుల క్రితమే మిజోరాంకు బదిలీ అయ్యేరు. ఎవరూ ఊహించని విదంగా ఆమెను ఆ పదవి నుండి తొలగిస్తూ రాష్ట్రపతి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే అందుకు కారణాలు మాత్రం ఇప్పటివి కాకపోవడం మరో విశేషం. ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడు 2011 నుండి 2014 వరకు 63 సార్లు ప్రత్యేక విమానంలో ఆమె స్వంత రాష్ట్రమయిన రాజస్థాన్ వెళ్ళి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ పిర్యాదు మేరకు ఆమెను గవర్నరు పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడే ఆమెను తొలగించి ఉండవచ్చును. కానీ ఇంతకాలం అధికారంలో కొనసాగనిచ్చి వేరే రాష్ట్రానికి బదిలీ అయిన తరువాత ఆమెను పదవిలో నుండి తొలగించడం వెనుక కూడా పెద్ద కధే ఉంది. నిజానికి ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్ర మోడీతో ఘర్షణ వైఖరి అవలంభించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఆమెతో సహా కాంగ్రెస్ కు చెందిన అనేకమంది గవర్నర్లను పదవిలో నుండి స్వచ్చందంగా తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం కోరింది. కానీ ఆమెతో సహా మరొకొందరు గవర్నర్లు అందుకు నిరాకరించడంతో వేరే రాష్ట్రాలకు బదిలీ చేయబడ్డారు. కమలబెనీవాల్ కూడా ఆ విధంగానే మిజోరంకు బదిలీ చేయబడ్డారు. అయితే గతంలో ఆమె మోడీని చాలా ఇబ్బంది పెట్టిన కారణంగానే ఇప్పుడు ఉద్వాసనకు గురయిఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.