కడప జగన్ అడ్డా కాదు.. చంద్రబాబు ఖిల్లా.. బీటెక్ రవి

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించి ఇక కడప ఎంత మాత్రం జగన్ అడ్డా కాదని నిరూపించామని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. మమానాడు చివరి రోజున గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత విజయవంతంగా మహానాడు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు.  జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందనీ, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకూ కడన జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు కడప చంద్రబాబు ఖిల్లా అని బీటెక్ రవి అన్నాడు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడింటిలో కూటమి విజయం సాధించిందనీ, ఇంకా కడన జగన్ ఇలాకా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు.

చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్‌గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి అన్న బీటెక్ రవి.. పులివెందులకు చెందిన ఇద్దరు సీఎంలు వైఎస్, జగన్  పులివెందులకు  కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సి పాలిటీకి తాగునీరు అందిస్తే..  జగన్ రెడ్డి   నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు.  వైసీపీ నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని  ఎద్దేవా చేసిన బీటెక్ రవి   వైఎస్ఆర్ హయాంలో పని చేసిన పలువురు ఉన్నతాధికారులు జైలుకెళ్లారనీ, ఆ తరువాత జగన్ హయాంలో ఆయన చెప్పినట్లల్లా ఆడిన  ధనుంజయ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకెళ్లారనీ అన్నారు.   పరిటాల రవి హత్య కేసు, మద్దెలచెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు బీటెక్ రవి.