జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా?

జస్టిస్ కనగరాజ్.. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి. జగన్ ప్రభుత్వం గతంలో హడావుడిగా ఆయన కీలక పోస్టు కట్టబెట్టింది. అప్పటి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి.. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమించింది. అయితే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడంతో ఆయన పదవికి ఎసరొచ్చింది. 

ఎస్ఈసీ పోస్టు అయినా తమకు ఉపయోగపడ్డారనే కారణంతో ఆయనను ఏదో ఒక పోస్టులో నియమించాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. జస్టిస్ కనగరాజ్‌కు ఎలాగైనా పదవి ఇవ్వాలని  పట్టుదలగా ఉన్న జగన్.. ఎస్‌ఈసీ  తర్వాత పోలీస్ కంప్లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా పదవి ఇచ్చారు. అయితే రెండో పదవి కూడా కోర్టులో నిలబడలేదు. తాజాగా  ఓ కమిటీలో సభ్యుడిగా కనగరాజ్ కు  పదవి ఇచ్చింది జగన్ సర్కార్. పీడీ చట్టం అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం అమలుకు ప్రతిరాష్ట్రంలో ఓ సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలిని ప్రభుత్వం నియమించింది. అందులో ప్రధానమైన పదవి చైర్మన్ ను కనగరాజ్‌కు ఇవ్వలేదు. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం ఉమ్మడి హైకోర్టులో పని చేసి రిటైరన జస్టిస్ సంజీవరెడ్డి అనే 85 ఏళ్ల పెద్దాయనకు చైర్మన్ పదవి ఇచ్చారు. సభ్యుడిగా మాత్రం కనగరాజ్‌కు చాన్సిచ్చారు. 

జస్టిస్ కనగరాజ్‌ తమకు ఉపయోగపడ్డారు కాబట్టి ఆయనకు ఏమైనా చేయకపోతే ఉపయోగించుకుని వదిలేశామన్న ఆరోపణలు వస్తాయని జగన్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే కనగరాజ్ కు ఏదో ఓ పదవిని వెదికి మరీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన మూడో  పదవి అయినా నిలబడుతుందో లేదో చెప్పడం కష్టమే. పీడీ యాక్ట్ సలహా మండలి అంటే… ముందస్తుగా ఎవర్ని నిర్బంధం లోకి తీసుకోవాలని సలహా ఇచ్చే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో 80 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వొచ్చో లేదో స్పష్టత లేదు. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తేనే కనగరాజ్‌కు ఈ పదవి కూడా ఉంటుందా.. ఊడుతుందా అనేది తేలుతుంది. చూడాలి మరీ జస్టిస్ కనగరాజ్ కు మూడో పదవి మూడు రోజుల ముచ్చటగానే ఉంటుంగా లేక నిలబడుతుందా...