జైలు నుంచి వచ్చినవారు ఒలింపిక్‌ విజేతలు కాదు- అనుపమ్

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ మరోసారి జేఎన్‌యూ విద్యార్థి నాయకులు మీద విరుచుకుపడ్డారు. ‘బుద్ధా ఇన్‌ ట్రాఫిక్‌ జాం’ అనే తన సినిమాను ప్రదర్శించేందుకు జేఎన్‌యూకి వెళ్లిన అనుపమ్‌, అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడంలోనూ, రాజకీయాలు చేయడంలో తప్పులేదు కానీ.... దేశానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయవద్దంటూ హితవు పలికారు. అనుపమ్‌ తన ఉపన్యాసంలో తరచూ కన్నయా కుమార్‌ గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు. నా తల్లిదండ్రులు పేదలు అని తరచూ చెప్పుకునే వ్యక్తి, ఏళ్లకి ఏళ్లు చదువుకున్న తరువాత కూడా వారికి సాయం చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. బెయిలు మీద విడుదల అయిన విద్యార్థులకి ఘనస్వాగతం పలకడాన్ని కూడా అనుపమ్‌ తప్పు పట్టారు. ఘన స్వాగతం పలికేందుకు వారేమీ ఒలింపిక్ పతకాన్ని సాధించలేదనీ, దేశం గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిని ఓ నాయకుడిగా ఎలా గుర్తిస్తారనీ ప్రశ్నించారు. జేఎన్‌యూ వివాదం గురించి పలు అభిప్రాయాలు వెల్లడించిన అనుపమ్ ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.