కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకే తండ్రి బాధ్యత

పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతకి సంబంధించి గుజరాత్‌ హైకోర్టు, ఓ సంచలన తీర్పునిచ్చింది. మగపిల్లలకి మైనారటీ తీరిపోయి, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే వయసు వచ్చేదాకానే వాళ్లని పోషించి తీరాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆడపిల్లల సంగతి వేరని, వారికి పెళ్లి చేసేవరకూ కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుందని పేర్కొంది. దినేష్‌ ఓజా అనే ఒక వైద్యుడికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. దినేష్‌ ఓజా పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అతని భార్యకు దినేష్‌ నెలనెలా కొంత భరణం చెల్లించాలని అప్పటి తీర్పు స్పష్టం చేసింది. అతని భార్యతో పాటు ఉంటున్న పిల్లవాడికి కూడా 18 ఏళ్లు వచ్చేవరకు కూడా ఆర్థిక సాయం చేయాలని పేర్కొంది. 2013లో ఆ పిల్లవాడికి 18 ఏళ్లు నిండటంతో ఓజా తన చెల్లింపులను నిలిపివేశాడు. ఈ విషయమై అతని భార్య గుజరాత్‌ హైకోర్టులో కేసుని దాఖలు చేయగా, కోర్టు దినేష్‌కు అనుకూలంగా తీర్పునందించింది. పిల్లలు శారీరికంగానో, మానసికంగానో వైకల్యంతో ఉంటే తప్ప... 18 ఏళ్లు దాటాక కూడా, వారి భారాన్ని తండ్రి మీద మోపలేమని స్పష్టం చేసింది