బీహార్‌లోని పేద శాసనసభ్యులకు బహుమతులు!

posted on: Mar 19, 2016 2:48PM

బీహార్‌లోని ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు లేవు. కానీ ఆ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం శాసనసభ్యులందరికీ మైక్రో ఓవెన్లు పంచిపెట్టింది. ఇందుకోసం అయిన ఖర్చు అక్షరాలా 30 లక్షలు! తమ రాష్ట్రంలోని శాసనసభ్యులు మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి తనిఖీ చేసేందుకు, పాపం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారనీ... అలా మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమ ఆహారాన్ని వెచ్చ చేసుకునేందుకు మైక్రో ఓవెన్లు ఇచ్చామని పేర్కొంది విద్యాశాఖ. అయితే ఇలాంటి బహుమతులు అక్కడి శాసనసభ్యులకు కొత్తేమీ కాదు. తమ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు లేవనెత్తుతున్నారంటూ వివిధ ప్రభుత్వ శాఖలు అక్కడి శాసనసభ్యులకు బహుమతులు అందించడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. ‘ప్రజల సమస్యలను చర్చించడం శాసనసభ్యుల ధర్మం కదా, అందుకోసం బహుమతులు ఏంటి?’ అన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ బహుమతులు వ్యవహారంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్, తన సహచరులను వెనకేసుకు వస్తున్నారు. ‘బీహార్ చాలా పేద రాష్ట్రమనీ, ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యేవారు కూడా పేదవారనీ, అలాంటివారికి బహుమతులు ఇస్తే తప్పేముందనీ...’ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికల సంఘానికి అందించను అఫిడవిట్లను తెరిచి చూస్తే, ఆ రాష్ట్ర శాసనసభ్యులలో ఎక్కువశాతం ధనవంతులే అని తేలిపోతుంది. కానీ నేతలు ఆస్తులను ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయరు కదా! కాబట్టి వారు ఎప్పటికీ పేదవారి కిందే లెక్క!

google-ad-img
    Related Sigment News
    • Loading...