వైసీపీపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయనున్న జనసేన!!

 

సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని జనసేన నిర్ణయించింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం.. సోషల్ మీడియాలో పవన్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ బర్త్ డే రోజు 2000 కోట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్లాన్ చేస్తున్నారని వివాదాస్పద పోస్ట్ చేసింది.

 

 

"పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి, వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి.. దానిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు." అని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఫేస్ బుక్ పేజీలో సంచలన పోస్ట్ చేసింది.

 

 

ఈ పోస్ట్ చూసిన జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు, లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనసేనపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ స్పష్టం చేశారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.