ఐ బాబోయ్ జగన్.. బినామీ పేరుతో సిమ్ కార్డు.. సిగ్నల్ యాప్ లో సీక్రెట్ చాట్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం.  జగన్ ఫోన్లు, యాప్ లు, గాడ్జెట్ల వాడకం తనకు ఇష్టం ఉండదని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించననీ, తేనకు అసలు ఫోనే లేదనీ, ఇక నంబర్ ఎక్కడ నుంచి వస్తుందనీ పలు సందర్భాలలో చెప్పుకున్నారు. సీఏంగా ఉన్న ఐదేళ్లూ, పరాజయం తరువాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తరువాత చాలా రోజుల వరకూ ఫోన్ జోలికి వెళ్లని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కుని దానితో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తం అవుతాయి. అలాగే వ్యక్తం అవుతున్నాయి కూడా.

ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ కు ఎందుకు మారిపోయింది అంటే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తరువాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్టౌతున్నారు. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ అరెస్టయ్యారు. వీరిలో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవిత కాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్టయ్యారు. దీంతో  మద్యం కుంభకోణం తీగలు కదిలాయి.. ఇక తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడమే తరువాయి అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.  జగన్ హయాంలో సీఎంవోలో చేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా నోటీసులు అందుకుని విచారణకు హాజరౌతున్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు? అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది? ఎవరేం చెబుతున్నారు? ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరం అని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లూ లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారంటున్నారు.   భద్రతా పరంగా ఐఫోన్ మిన్న అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారనీ, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారనీ తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా చేసిన ఛాట్ నిర్దుష్ట సమయం తరువాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. పూర్తిగా ఎరైజ్ అయిపోతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరైజ్ అయిపోవాలన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఎ రకంగా చూసినా ఇది  సేఫ్ అని భావించడం వల్లనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు అవసరమై సమయంలో అవసరమైన మేరకు చాటింగ్ చేసి.. ఆ వెంటనే ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో జగన్ సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారంటున్నారు.  సిగ్నల్ యాప్ ద్వారా చేసిన చాటింగ్ ట్రేస్ చేయడానికి సాధ్యం కాదనీ, ఎక్కడా సేవ్ కాదనీ చెబుతున్నారు.  అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయాన్ని మద్యం కుంభకోణం దర్యాప్తు అధికారులు కూడా ధృవీకరించారు. కేవలం సిగ్నల్ యాప్ మాత్రమే కాకుండా ఫేస్ టైం యాప్ ద్వారా కూడా జగన్ మాట్లాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జగన్ ఐఫోన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు, నిందితుల విచారణ తదితర వివరాలను మినిట్ టు మినిట్ తెలుసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ వాడుతున్న ఐఫోన్ సిమ్ కార్డు ఆయన  పేరు మీద కాకుండా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బినామీ పేరు మీద తీసుకున్నారనీ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.