రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా.. చంద్రబాబు
posted on Aug 2, 2025 10:57AM

పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం (ఆగస్టు 1) గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రసంగించన చంద్రబాబు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందనీ, చారిత్రక సంపదకు ప్రతిరూపమనీ అన్నారు. గండికోట ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకులు బస చేసేందుకు స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అలాగే రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరి కల్లా టెంట్ సిటీని రెడీ అవుతుందన్నారు. అలాగే సెప్టెంబర్ నుంచి హెలిరైడ్స్ ఆరంభమౌతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సీఎం సమక్షంలో పలు ఒప్పందాలు జరిగాయి. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పోరేషన్ తో 500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. గండికోటతో పాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్, జెట్ స్కీయింగ్ లాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి.
కేంద్రప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఏపీలో అమలు చేస్తున్న టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.