పాక్ మిడిసిపాటుకి భారత్ చెక్.. అతలాకుతలమైన పాక్ ఎయిర్ఫోర్స్
posted on May 14, 2025 2:31PM

అమెరికా, చైనా ఫైటర్ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన దాదాపు ఐదోవంతు మౌలిక వసతులు, ఫైటర్ జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో మన దేశం జరిపిన ప్రతిదాడిలో ఇవి దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులను పాక్ ఆయుధాగారాలు, ఎఫ్-16, జేఎఫ్-17 వంటి విమానాలు దాచిన సర్గొదా, భోలారీ ఎయిర్ పోర్టులతోపాటు.. పాక్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న చక్లాలలోని నూర్కాన్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
సింధి రాష్ట్రంలోని జమ్సోరో జిల్లాలోని బోలారీ ఎయిర్ బేస్లోనే స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, మరో నలుగరు ఎయిర్మెన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిలిపి ఉంచిన పలు ఫైటర్జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రతిదాడిలో భారత్ నూర్ఖాన్, రఫీకీ, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పసురూర్, చునియన్, సర్గోదా, భోలారీ, జకోబాబాద్లో దాడులు చేసింది.
దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్లోని షాబాజ్ బేస్ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. తమ కాల్పుల్లో పాక్ ఆర్మీ దాదాపు 40 మంది సైనికులను కోల్పోయి ఉండొచ్చని భారత్ చెబుతోంది.
మంగళవారం భారత మిలిటరీ ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు సహా ఇతర ఆధారాలను 70 దేశాల ప్రతినిధులకు చూపించాయి. వీటిల్లో పాక్ క్షిపణి, డ్రోన్ శకలాలు కూడా ఉన్నాయి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డీసీ డీఎస్ రానా ఈ ప్రెజెంటేషన్ నిర్వహించారు. తాము లక్ష్యాలను ఎలా ఎంచుకొంది.. ఎలా ధ్వంసం చేసిందీ కూడా తెలిపారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎక్స్ఖాతాలో వెల్లడించింది.
.webp)