జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం
posted on Apr 25, 2025 4:30PM

పాక్ పని అవుట్ !
భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే. అయితే ఇప్పడు ఆ పవిత్ర బంధం కూడా పుటుక్కుమంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు, జమ్మూకశ్మీర్లో అత్యంత హేయమైన ఉగ్ర దాడికి పాల్పడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మన దేశం సింధూ జలాల ఒప్పందానికి చెల్లు చీటి రాసింది. నిజానికి గతంలోనూ అనేక సందర్భాలలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వుంది.
నిజానికి దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందాలు నిత్య కలహాలకు కారణం అవుతున్న తీరును చూస్తున్నాం. ఎక్కడి దాకానో ఎందుకు, నిన్న మొన్నటి వరకు కలిసున్న ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకాలకు సంబంధించిన ఒప్పందాల ఉల్లంఘనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అనేకం ఉన్నాయి. రైతులు, రాజకీయ పార్టీలు కత్తులు దూసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
అలాగే.. ఇంకా అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కూడా జల జగడాలు సాగుతున్నాయి. అయితే.. భారత ,పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక చారిత్రిక ఒప్పందంగా చరిత్రలో మిగిలి పోయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల పంపిణీ ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది.
చరిత్రలోకి వెళితే.. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ ఈ ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్, చీనాబ్ నదుల నీరు పాకిస్థాన్కు దక్కింది. ఇవి కాకుండా బియాస్, సట్లెజ్ జలాలు కూడా వెడుతుంటాయి. ఇక మన దేశం భూభాగంలో ప్రవహించే నదీ జలాలను ప్రవహించే నీటిని మనం వాడుకోవచ్చును. కానీ, జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుకుని.. మళ్ళీ పాక్ కు వదిలేయాలే కానీ.. ఆ నీటిని నీటిని సాగు, తాగు ప్రయోజనాలకు వాడుకోరాదు.
నిజానికి ఎగువన ఉన్న దేశంగా మనం ప్రాజెక్టులు కట్టుకుని, నీటిని నిల్వ చేసుకున్నా.. మళ్ళించి మన అవసరాలకు వాడుకున్నా.. పాకిస్థాన్ గొంతు తడవదు. పంట పొలాలు నీరు అందదు. పాకిస్థాన్ నీటి అవసరాలకు 80 శాతం వరకూ ఈ ఒప్పంద పరిధిలో అందుతున్న నీరే ఆధారం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే.. సింధూ జలాల ఒప్పందమే పాకిస్థాన్ ను బతికిస్తున్నది. ఆదే ఆ దేశానికి జీవాధారం, జీవనాధారం. పాకిస్థాన్ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది.
ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు.
సింధూ బేసిన్ నుంచి పాక్కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్ఏఎఫ్) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి.
పాకిస్థాన్ విద్యుత్ కు కీలకమైన మంగల డ్యామ్ను జీలమ్ నదిపై నిర్మించారు. ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్ పాక్ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్లో 24శాతం జల విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. పాకిస్థాన్ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చును.
అయితే మన దేశం ఒప్పందం నిలిపివేసినా.. పాకిస్థాన్ పై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని.. గతంలో సింధూజలాల కమిషనర్గా పనిచేసిన ప్రదీప్కుమార్ సక్సెనా వంటి నిపుణులు అంటున్నారు.
అవును. మన దేశం తీసుకున్న కఠిన నిర్ణయం ప్రభావం పాక్పై తక్షణమే పడకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాంకేతికంగా సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి.. మళ్లించడానికి తగిన వసతులు లేవు. అయిత డ్యాముల నిర్మాణానికి ఇంతవరకు ఉన్న అవరోధాలు ఈ నిర్ణయంతో తొలిగి పోతాయి. కానీ.. తక్షణం నిర్మాణాలు చేపట్టినా, అవి పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
అలాగే.. ప్రస్తుత ఉద్రిక్తలు కొంత సర్డుమణిగిన తర్వాత, ప్రపంచ బ్యాంకు, లేదా ఎ అమెరికానో పట్టుకుని ఒప్పందాన్ని పునరుద్దరించుకో వచ్చనే ఆలోచనతో పాక్ నేతలు ఉన్నారని అంటున్నారు. మరోవంక భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా తీసుకుని, పాకిస్థాన్ ఉగ్ర చర్యలకు జలాస్త్రంతో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.