సోమశిల చేప విల విల
posted on Jun 2, 2025 10:11AM
సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది. అలివి గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. నిషేధిత వలతో సోమశిల లో సైజుకు రాని చిన్న పిల్ల చేపలను సైతం ఊడ్చి వేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల పరిధిలోని సోమశిల బ్యాక్ వాటర్ లో యథేచ్ఛగా చేపల వేట సాగుతున్నా.. వాహనాల్లో చేపలను తరలిస్తున్నా అటు మత్స్యశాఖ అధికారులు కానీ ఇటు అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపల మాఫియాకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. చేపల వ్యాపారులు కొందరు మాఫియాను తలపిస్తూ రోజుకు లక్షలాది రూపాయల మత్స్య సంపదను తోడేస్తున్నారు. 30 నుంచి 40 మందికి లైసెన్సులు ఉన్నట్టు తెలుస్తున్నా సోమశిల వెనక జలాల్లో వందల సంఖ్యలో వేటగాళ్లు జాతరను తలపించేలా చేపలవేట సాగిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో కి వెళ్లేందుకు అనుమతులు లేకున్నా వాహనాలు వెళుతూనే ఉన్నాయి. కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన వేటగాళ్లు చేపలు వేటాడితే ఆ చేపలను వ్యాపారుల వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు.
సోమశిల బ్యాక్ వాటర్స్ లో చేపల మాఫియా పిల్ల,పెద్ద చేపలన్న తేడా లేకుండా వూడ్చేస్తోంది చేపల వేటలో ఆరితేరి, అనుభవం కలిగిన కోస్తా జిల్లాలోని కాకినాడ,తుని తదితర ప్రాంతాల వేటగాళ్ళను తీసుకొచ్చి మరీ మాఫియా చేపలవేట సాగిస్తోంది. అలివి వల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ, వీటితోనే వేటాడుతుండడంతో సైజుకు రాని చిన్న చేపలు, ఎదుగుదల లో ఉండే చేపలు సైతం బయట పడుతున్నాయయి. ఈ కారణంగా చేపలు పెద్దవి కాకుండా మత్స్య సంపదకు గండి కొడుతున్నారు . నలుసు లాంటి చేపలు అయితే కుప్పలు కుప్పలుగా పడేయడం, చిన్న చేపలను ఎండవేసి టన్నుల కొద్దీ అమ్ముకోవడం జరుగుతుంది.
చేపలు పట్టే వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే లైసెన్స్ లు జిల్లాలో 30 నుంచి 40 మందికి మాత్రమే ఉండగా వాటిని అడ్డుగా పెట్టుకుని వందల మందితో చేపల వేట కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 20 వేల రూపాయలు కోస్తా ప్రాంతంలో మత్స్య కారులు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి చేపలు పట్టడం జరుగుతుంది.
జిల్లాలో ఉండే లైసెన్స్ లు కూడా చాలా మటుకు ఫోటోలు ఒకరివి ఉంటే మరొకరి పేరు తో లైసెన్స్ ఉంటుందని సమాచారం.ఈ రకంగానూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒక అధికారి వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడంతో తో కొందరు మళ్ళీ లైసెన్స్ లు కోర్టు ద్వారా తీసుకున్నట్లు సమాచారం
చేపల మాఫియా దాటికి అసలైన మత్స్యకారులు నానా కష్టాలు పడుతున్నారు. సోమశిల లో చేపలు ఎదిగితే అవి వర్షాకాలంలో సగిలేరు. పెన్నా నదులు ప్రవహించేటప్పుడు నీటికి ఎదురెక్కి వస్తాయి. దీంతో వీటి ప్రాంతాల పరివాహ ప్రాంత అడుగుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళి జీవనం సాగిస్తుంటారు.ప్రస్తుతం ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో చివరకు కూలీ పనులకు వెళుతున్నారు.
సోమశిల బ్యాక్ వాటర్ లోని గోపవరం ,అట్లూరు , ఒంటిమిట్ట ,నందలూరు మండలాల్లో పెద్ద ఎత్తున చేపల వేట సాగుతోంది, గోపవరం మండలం లోని గట్టుపల్లి ,బ్రాహ్మణ ,ప్రాంతాలు అట్లూరు మండలంలోని బ్యాక్ వాటర్ ప్రాంతంలో చేపల మాఫియా కూలీలను తిష్ట వేయించి వేటాడిస్తోంది. ఒంటిమిట్ట మండలంలోని వెనుక జలాల్లో కూడా ఈ వేట ఎదేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు వారాల క్రితం గోపవరం మండలంలో చేపలతో వెళుతున్న ఒక వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని ఫిషరీస్ శాఖకు అప్పజెప్పారు. అంతేకాదు నెల్లూరు రోడ్డు లో రెండు చోట్ల చెక్ పోస్టులు ఉన్నా కూడా ఈ చేపల వాహనాలు తిరుగుతూ ఉండడం గమనార్హం.
చేపల మాఫియా రోజూ టన్ను పెద్ద సైజు చేపలు వేటాడితే చిన్న చేపలు మరో టన్ను వరకు వేటాడుతున్నారు. ఇవి రెండు లక్షల రూపాయలు మేరకు విలువ చేస్తాయని చెప్పుకొస్తున్నారు .పెద్ద చేపలను కడప, కేరళకు, కలకత్తా లకు తరలిస్తుండగా ఎండు చేపలను అక్కడే ఎండబెట్టి విజయవాడకు తరలిస్తున్నారు. ఒక కేజీ ఎండు చేపలు రూ.130 ప్రకారం పచ్చి చేపలు అయితే 70 నుంచి 80 రూపాయలు వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అడ్డూఅదుపు లేకుండా వేట సాగిస్తుండడంతో సోమశిల మత్స్య సంపద మటుమాయం అయ్యే పరిస్థితి నెలకొంది.
రిజర్వ్ ఫారెస్ట్ లోకి అనుమతి కుండా ఎవరూ ప్రవేశించకూడదు .అంతే కాదు రెవెన్యూ ఫారెస్ట్ లోకి కూడా అనుమతి లేకుండా వాహనాలకు ప్రవేసించ కూడదు. అయితే రిజర్వుపారెస్ట్ నుంచే చేపల వాహనాలు తిరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమౌతున్నారు. గతంలో చేపల వేట మాటున ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. చేపల రవాణా పేరుతో ఇప్పుడు కూడా వాహనాలు, వేటగాళ్లు తిరుగుతూ ఉండడంతో ఎర్రచందనం రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది.