బెజవాడలో హైదరాబాద్ తరహా పబ్ కల్చర్.. రోడ్లపై యువత వీరంగం

విజయవాడలో  పబ్ కల్చర్ రాను రాను పెరిగిపోతోంది. పబ్‌లలో తాగి తందనాలు ఆడటమే కాకుండా హైదరాబాద్‌ తరహాలో రోడ్ల‌పైకి వస్తున్న యువత ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవల కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందరు రోడ్‌లో అర్ధరాత్రి యువకులు ఘర్షణ పడ్డారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందర్ రోడ్డులో యువకులు  బాహాబాహీకి దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా ఆరా తీయగా... అర్ధరాత్రి రెండు గంటల వరకూ పబ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో అర్ధరాత్రి పబ్‌లో తనిఖీలు చేసిన పోలీసులు. లాఠీలతో యువతీ, యువకులను చెదరగొట్టి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో పబ్‌లోని మందు బాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీపీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తుండటంతో యువత మత్తుకు బానిసలుగా మారుతున్న పరిస్థితి. మత్తు పదార్థాలతో పాటు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహాలో అర్ధరాత్రి వరకు పబ్‌ లు నిర్వహిస్తుండే వారు. కానీ విజయవాడలో మాత్రం రాత్రి 10 లేదా 11 గంటల వరకు పబ్‌లు క్లోజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వరకు పబ్‌లను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో సిటీలోని పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. రెండు రోజుల కిందట అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu