హైదరాబాద్లో ఇద్దరు పిల్లల్ని నరికి చంపిన తల్లి
posted on Apr 17, 2025 7:53PM
.webp)
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో దారుణం జరిగింది. ఓ కసాయి తల్లి తన ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపింది. అనంతరం ఆమె భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. హత్యకు గురైన పిల్లల వయసు 7, 5 ఏళ్లు ఉంటాయని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తేజస్విని రెడ్డి అనే మహిళ గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తేజస్విని తన ఇద్దరు కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
పెద్ద కుమారుడు హర్షిత్ స్పాట్ డెడ్ కాగా.. తీవ్రంగా గాయపడిన చిన్న కొడుకు ఆశిష్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. చనిపోయే ముందు తేజస్విని ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.