తొడగొట్టిన బాలయ్య.. సీమ హక్కుల కోసం హర్యానా తరహా ఉద్యమం!
posted on Oct 17, 2021 4:24PM
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. సినిమాల్లో ఆయన తొడ గొట్టడం కామనే. కాని ఈసారి ఆయన తొడగొట్టింది జనం కోసం, జనం సమస్యల కోసం. తొడగొట్టడమే కాదు హర్యానా తరహా ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. ఇంతకీ బాలయ్య ఉద్యమం చేయబోయేది దేని కోసమే తెలుసా... నీటి కోసం. రాయలసీమకు కృష్ణా జలాల కోసం. రాయలసీమకు నికర జలాల కోసం.
కృష్ణా జలాల్లో వాటా కోసం, ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లడంపై కొన్ని రోజులుగా రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్ పై సీమ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ నేతలు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని అన్నారు బాలకృష్ణ. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలని తెలిపారు.
ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని బాలయ్య ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని, నికర జలాలు ఇవ్వాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.నాడు రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, సీమ కోసం హంద్రీనీవా తీసుకువచ్చారని బాలకృష్ణ వివరించారు. కానీ హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులకు పుష్కలంగా నీరు అందించడంలేదని పేర్కొన్నారు. 14 వందల చెరువులుగా ఉండగా.. కేవలం 3 వందల చెరువులకు మాత్రమే జలాలు విడుదల చేశార్ననారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.