గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కోడెల.. అదే కారణమా?

 

వరుస వివాదాలతో సతమతమవుతున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఆయన తన నివాసంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

కోడెల వరుస వివాదాలతో సతమవుతున్నారు. కోడెల కుటుంబం కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలతో పాటు, ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు నమోదయ్యాయి. దానికితోడు అసెంబ్లీ ఫర్నీచర్ వివాదం చుట్టుముట్టింది. తాజాగా కంప్యూటర్లు మాయం అంటూ మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. ఈ వరుస ఆరోపణలు, వివాదాలతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఆ ఒత్తిడి ఆయన గుండెపోటుకు కారణమైందని భావిస్తున్నారు.