అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!!

 

విపరీతమైన బాధ, కోపం, ఆనందం ఇలాంటి సమయాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. క్రికెటర్ అంబటి రాయుడు అదే చేసాడు. వరల్డ్‌ కప్‌ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడంతో అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, గత జూలైలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇప్పుడు తన రిటైర్మెంట్ ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తాజాగా తెలిపాడు. ఆవేశంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోలేదని.. జట్టులో చోటు దక్కనప్పుడు నిరాశకు గురి కావడం సహజమేనని చెప్పాడు. అందుకే అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నానన్నాడు. అయితే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. మళ్లీ ఆలోచించానని.. మళ్ళీ భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని తపిస్తున్నానని అన్నాడు. భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని.. ఐపీఎల్ లో కొనసాగుతానని తెలిపాడు. ప్రపంచకప్ లో చోటు సాధించాలని నాలుగైదు ఏళ్లు శ్రమించానని.. అయినా, చోటు దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానని చెప్పాడు. ఇప్పటికిప్పుడే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన తనకు లేదని.. జట్టులో స్థానం కోసం తాను ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లాల్సి ఉందని చెప్పాడు. రానున్న రోజుల్లో ఏం జరగుతుందో చూద్దామని అంబటి రాయుడు అన్నాడు. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌స్లామ్‌ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.