ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ కుమార్తె

ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.  ఆ యువతి మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత! వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురామ్‌రెడ్డి ఖమ్మం పార్టమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రఘురామ్‌రెడ్డి కుమారుడిని ఆశ్రిత పెళ్ళాడారు. పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో వున్న తన మామగారికి మద్దతుగా ఆశ్రిత ఎన్నికల ప్రచారంలోకి ఎంటరయ్యారు. రఘురామ్‌రెడ్డికి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేస్తారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు ట్విస్ట్ ఇస్తూ ఆశ్రిత కాంగ్రెస్ కండువా వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆశ్రిత ఈ ఒక్కరోజే ప్రచారంలో పాల్గొన్నారా.. ప్రచారం ముగిసేవరకూ పాల్గొంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావలసి వుంది. ఈసారి ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రఘురామ్‌రెడ్డి గెలిస్తే, రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి ఆయన రాజకీయ వారసురాలిగా ఆశ్రిత ఎన్నికలలో నిలబడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంపిటీషన్ భారీగా వుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో వున్నారు. మరి ఆశ్రిత ప్రచారంలోకి ఎంటరైంది కదా.. ఏ మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.