చిన్నారి ఉసురు తీసిన మూఢనమ్మకం.. విశాఖలో దారుణం
posted on Apr 25, 2025 3:20PM

మూఢ నమ్మకం ఓ చిన్నారి ఉసురు తీసింది. 11 ఏళ్ల బాలిక పూర్ణ చంద్రిక సొంత అమ్మ, అమ్మమ్మల మూఢ నమ్మకానికి బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలో గురువారం (ఏప్రిల్ 24) చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలికకు దయ్యం పట్టిందంటూ విశాఖ జ్ఞానపురం వద్ద దయ్యాన్ని వదిలించే శక్తులు ఉన్న వారు ఉన్నారన్న నమ్మకంతో తీసుకువచ్చారు.
సెయింట్ పీటర్స్ చర్చి వద్ద ఆ బాలికకు గుడ్డ కప్పి, దేవుడి చిత్రపటం వద్ద ఉంచారు. అంతకు ముందే ఆమె కరుస్తోందంటూ ఇంటి వద్దే నోట్లో గుడ్డలు కుక్కి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఆ చిన్నారి ఊపిరాడక మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఉత్తరాంధ్రలో చేతబడి, దయ్యాన్ని వదిలిస్తామనే నెపంతో ఇటువంటి సంఘటనలు జరిగాయి.
అరకు నియోజకవర్గం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చేతబడి అనుమానంతో జరిగిన దాడిలో ముగ్గరు మరణించారు. అలాగే 2015లో డుంబ్రిగుడ మండలం రంగిసింగిగూడ గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడన్నఅనుమానంతో ఒకరిని సజీవదహనం చేసిన ఘటన జరిగింది. ఇప్పుడు తాజాగా దెయ్యం పట్టిందన్న మూఢనమ్మకంతో చిన్నారి ఉసురు తీశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు జ్ణానాపురం చర్చి వద్ద దెయ్యం వదిలిస్తామంటూ పూజలు ఎవరు నిర్వహిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.