కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు
posted on Aug 10, 2025 1:53PM
.webp)
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం గూటికి చేరారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్రావు కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమని రామచందర్రావు అన్నారు.
అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు నచ్చే బీజేపీలో చేరానని అన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. గువ్వల బాలరాజు కూడా ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి రావడం అభినందనీయమని అన్నారు.
అచ్చంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధికి గువ్వల బాలరాజు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీనీ విమర్శించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఓటమి తప్పదనే విషయాన్ని రాహుల్ ముందే గుర్తించారని.. అందుకే ఈసీపై, మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ మండిపడ్డారు.