మాది తెనాలి, మీది తెనాలి అంటున్న తెలంగాణా నేత

 

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి తన చిత్తూరు జిల్లాకే చెందినవారు కావడంతో చంద్రబాబు నాయుడు ‘మీది తెనాలి మాది తెనాలి’ అన్న రీతిలో ‘మీది చిత్తూరు మాది చిత్తూరు’ అనే సెంటిమెంటుతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని హేళన చేసారు. ‘కిరణ్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని నిత్యం తిట్టిపోసే చంద్రబాబు నాయుడు స్వయంగా అవిశ్వాసం పెట్టకపోగా, మేము పెడుతున్న అవిశ్వాసానికి కూడా మద్దతునీయకపోవడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొన్నట్లు కనిపిస్తున్నారు’ అని ఎద్దేవా చేసారు.

 

ఇక్కడ ఈ తెరాస నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మనస్పూర్తిగా ప్రయత్నిస్తున్నామని చెపుతుంటే, మరో వైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని కలిపెసేందుకు నేటికీ సిద్దంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని ఒకవైపు అవిస్వాసం పెడుతూనే, మళ్ళీ అదే పార్టీలో కలిసిపోవాలని ఎందుకు ఉవ్విళ్ళు ఊరుతున్నారో తెరాస నేతలే చెప్పాలి.