ఈడీ ప్రశ్నలతో రాజ్ కేశిరెడ్డి ఉక్కిరిబిక్కిరి.. ఏడుగంటల విచారణ.. వాంగ్మూలం నమోదు

మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బుధవారం (మే28) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో  రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా కేశిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో అక్రమ నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరవేశాడన్న విషయంపైనే ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారలు కేశిరెడ్డిని విచారించారు. వందకు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఈ కుంభకోణంలో కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారు? బ్యాంకు ఖాతాలు ఎన్ని?  ఏయే బ్యాంకులలో ఖాతాలు తెరిచారు వంటి ప్రశ్నలతో కేశిరెడ్డిని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు చెబుతున్నారు.  ఏడుగంటల సుదీర్ఘ విచారణ అనంతరం కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణంపై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఇలా ఉండగా ఇదే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు గురువారం (మే29) తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన  ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్పలను కూడా కస్టడీకి అప్పగించాలంటూ సిట్ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు గురువారం (మే 29) తీర్పు వెలువరించనుంది.