జగ్గారెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసు

 

సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన సంగతి తెల్సిందే.ఈ సందర్బంగా మాట్లాడిన జగ్గారెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు,నిబంధనలకు విరుద్ధంగా పలు వాగ్దానాలు చేశారు.జగ్గారెడ్డి వ్యాఖ్యలను కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదును పరిశీలించిన నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి.. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని జగ్గారెడ్డికి నోటీసులు జారీ చేశారు.

‘నాకు ఊచ లు చూపించిన కేసీఆర్‌.. నీకు చుక్క లు చూపిస్తా’అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారు. నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వాగ్దానం చేయడం నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నుంచి అందిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత నోటీసు జారీ చేసినట్లు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.జగ్గారెడ్డి ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎన్నికల సంఘం నియమాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.