ప్రమాదమా? ప్లాన్ చేశారా?.. యాక్సిడెంట్ లో నయీమ్ మేనకోడలు మృతి 

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మృతి చెందారు. అయితే ఆ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి అద్దంకి జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందుగా వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సన్నిహితుల గృహ ప్రవేశానికి వెళ్లి.. అక్కడి నుండి మిర్యాలగూడకు వెళుతుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు అధికారులు. 

ఈ ప్రమాదం నిజంగా లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేసిన ప్రమాదమా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లింది. షాహీనా పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని నయీమ్  దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టినవేనని తెలుస్తుంది. ఈ ఆస్తుల పరంగా ఎన్నో వివాదాలు  ఉన్నాయి. ఆ వివాదాల్లో ఎవరైనా షాహీనాను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదానికి ప్లాన్ చేశారా..? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.