సిందూర్ పై చర్చ.. ఎటూతేలని రచ్చ!
posted on Jul 30, 2025 5:42PM

పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జూలై 28,29 తేదీలలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే.. ఈ సుదీర్ఘ చర్చ వలన దేశానికి ఏమి జరిగింది? దేశం ముందున్న సందేహాలకు ఏ మేరకు సమాధానం లభించిది? అంటే మాత్రం సమాధానం చెప్పడం సాధ్యం కాదు. నిజానికి దేశ భద్రత, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, సైనిక చర్యల నియమావళితో పాటుగా అనేకానేక సున్నిత అంశాలతో ముడిపడిన విషయాల్లో అన్ని విషయాలు బయటకు చెప్పడం కుదిరే పని కాదు. విజ్ఞత, వివేచన ఉన్న అందరికీ ఇది తెలిసిన విషయమే. కాబట్టి.. ప్రభుత్వం చెప్పిందే జరిగిందని కానీ.. జరిగిందే ప్రభుత్వం చెప్పిందని కానీ అనుకోవలసిన అవసరం లేదని నిపుణుల అంటున్నారు. అలాగే.. ప్రతిపక్షం దేశ హితం కోరి విజ్ఞత, వివేచనతో పరిధులు తెలుసుకునే ప్రశ్నలు సంధించిందని కూడా అనుకోలేమని అంటున్నారు. నిజానికి.. రాజకీయ లక్ష్యాలు, రాజకీయ ప్రయోజనాలలే పరమార్ధంగా.. రాజకీయాల చుట్టూనే తిరిగిన చర్చను, రాజకీయ కోణంలోనే చూడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అందుకే.. రెండు రోజుల పాటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య, భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంత ఉత్కంఠభరితంగా సాగిన చర్చ దేశంలో రాజకీయ వేడిని పుట్టించింది. ఆ కారణంగానే పార్లమెంట్ చర్చ పై రాజకీయ వర్గాల్లో రాజకీయ చర్చ మరింత వేడిగా సాగుతోంది. పార్లమెంట్ లో జరిగిన చర్చను, ఆ సందర్భంగా అధికార విపక్షాలు వ్యవహరించిన తీరును బట్టి రాజకీయంగా ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్.. ఎవరికి ఏమిటి, అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎడతెగని జరుగుతోంది.
నిజానికి.. ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ఎక్కువగా ఆ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. గట్టిగానే ప్రశ్నించారు. ముఖ్యంగా.. భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన వల్లనే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే (మొత్తం 29 సార్లు) చెప్పుకున్నా, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మోదీకి దమ్ముంటే.. పార్లమెంట్’ నుంచి ట్రంప్ చెప్పింది అసత్యం.. ట్రంప్ అబద్ధాల కోరు అని మోదీ ప్రకటించాలని సవాల్ విసిరారు. అయితే.. చివర్లో చర్చలో జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ.. ట్రంప్ పేరు ప్రస్తావించకుండా.. ఒక్క ట్రంప్ అని మాత్రమే కాదు ప్రపంచ దేశాల నాయకులలో ఏ ఒక్కరూ కూడా కాల్పుల విరమణ చేయమని కోరలేదనీ.. పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాతనే తాత్కాలికంగా కాల్పుల విరమణకు మన దేశం అంగీకరించిందని స్పష్టం హేశారు. నిజానికి.. ఆ ఒక్క విషయంలోనే కాదు.. పాకిస్థాన్ కూల్చివేసిన యుద్ద విమానాల లెక్కలు చెప్పాలనీ, మోదీ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ( పొలిటికల్ విల్) లేక పోవడం వల్లనే ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయనీ.. ఇలా చాల కాలంగా వీధుల్లో వినిపిస్తున్న సందేహలనే రాహుల్ గాంధీ. కొంత గంభీంగా లోక్ సభలో లేవనెత్తారు.
అయితే.. అధికార కూటమి, ముఖ్యంగా బీజేపీ, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహాల శాఖ మంత్రి జయ శంకర్, అలాగే చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ అనుకూల పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూలమనే నేరేటివ్ బలంగా వినిపించారు. పాక్ పుట్టుక మొదలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన పాక్ అనుకూల ధోరణి వివరిస్తూ .. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. ఒక విధంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ అనుకూల పార్టీగా చిత్రీకరించడంలో కాంగ్రెస్ పార్టీకి పాక్ పార్టీ ముద్రవేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయింది. ఈ ముద్రను తొలిగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పడుతుందని, చాలా శ్రమ పడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడంలో బీజేపీ పాత్ర కంటే హస్తం పార్టీ స్వయంకృతం పాత్ర ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యంగా.. పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమయ్యే సమయంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పహల్గాంలో దాడి చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే అని ఎలా చెపుతారు? దేశీయ ఉగ్రవాదులు కూడా కావచ్చును కదా అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా.. అంతర్జాతీయ దౌత్య బృందంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, వారిని వెలివేసినట్లు ప్రవర్తించడం, అందుకు ఆ ఇద్దరు భారత్ అనుకూల స్టాండ్ తీసుకోవడమే కారణమనే ప్రచారం జరగడంతోంది.